
నన్ను బద్నాం చేస్తావా..! అవి తీసేయకపోతే నీ సంగతి చూస్తా..!
- Writer Desk

- Mar 15
- 5 min read
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కవిత మాస్ వార్నింగ్..!
సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన కవిత..!
........
మిస్టర్ రంగనాథ్. నీ పై డిఫమేషన్ కేసు వేస్తా.. నిన్ను కోర్టుకు లాగుతా..!
ఆదిత్య కన్ స్ట్రక్షన్ కబ్జాకు పాల్పడుతోందని నువ్వే గతంలో లెటర్ రాశావు..!
అవే ఆరోపణలతో నేను ధర్నా చేస్తే బద్నాం చేస్తావా?
తప్పుడు సమాచారంతో ట్విట్టర్ లో వీడియోలు పెడతవా?
ఇవ్వాళ సాయంత్రం వరకు వాటిని తొలగించకపోతే నిన్ను కోర్టుకు లాగుతా..!
అప్పుడు నీ ప్రభుత్వం, నువ్వు దూకి చావాలి..!
నిజం మాట్లాడిన వాళ్లనే బద్నాం చేస్తారా..!
మీరు, మీ ప్రభుత్వం గ్రాఫిక్స్ డిజైనర్లా.. కంటెంట్ క్రియేటర్లా..!
ఈ మాటలన్నది ఎవరో కాదు..! తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత..!
ఆదివారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు..! నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతూ..మాటలు మారుస్తూ నన్నే బద్నాం చేయాలని చూస్తావా..! అంటూ నిలదీశారు.. ఆదిత్య కన్స్ ట్రక్షన్ నిర్మాణాల విషయంలో ముమ్మాటికి తప్పులు జరిగాయని...హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయంపై లేఖ రాసినట్లు కవిత తెలిపారు..!

ఆమె ఇంకా ఏమన్నారంటే..!
మూసీ ప్రక్షాళన అనేది ప్రజలకు మంచి జరిగేలా ఉండాలి..మూసీ ప్రాజెక్ట్ కోసం ప్రపంచబ్యాంక్ కు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గతంలోనే చెప్పాం..
మొన్నటి సీఎం ప్రజెంటేషన్ లో ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తామని చెప్పలేదు.. గత ప్రభుత్వంలో మూసీ రివర్ బెడ్ లో నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వడానికి కారణాలేంటి అనేది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరముంది
పర్మిషన్ల వెనుక జరిగిన మాయాజాలం ఏంటీ..?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే మహమ్మరిని ప్రజలకు మీదకు వదిలింది..!
మొన్నటి వరకు కూడా మూసీకి ముప్పైమీటర్లు ఉన్న సరే వాటిని కూల్చేస్తామన్నారు. .మొన్న మేము ఒక ప్రైవేట్ సంస్థ వద్దకు వెళ్లి ప్రొటెస్ట్ చేశాం. మూసీ నది మధ్యలో ఆ ప్రాపర్టీని నిర్మిస్తుంటే మేము ప్రొటెస్ట్ చేశాం.! సాధారణంగా హైడ్రా వాళ్లు దేనికి కూడా మాట్లాడారు. కానీ మేము ప్రొటెస్ట్ చేసిన తర్వాత హైడ్రా అఫిషీయల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఐదు వీడియోలు పెట్టారు... దాంట్లో వాయిస్ ఓవర్ పెట్టి మరీ మొదటిసారి అలా చేశారు...! అయితే ఫ్రూప్ లేకుండా నేను ఏదీ మాట్లాడను. ఇప్పుడు హైడ్రా మీద మా వద్ద ఫ్రూప్స్ ఉన్నాయి..! మేము ఇప్పటి వరకు రంగనాథ్ గారికి ఆరు కంప్లైంట్స్ ను ప్రూఫ్స్ తో ఇస్తే కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదు..! కేవలం పేదవాళ్ల ఇళ్లను కూల్చుతూ పెద్దవాళ్ల ఇళ్ల జోలికి మాత్రం మీరు వెళ్లటం లేదు..! మేము మార్చి మూడు నాడు ధర్నా చేశాం..! కానీ హైడ్రా రాకముందే దానికి పర్మిషన్లు ఇవ్వటంతో మాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ట్విట్టర్ లో పెట్టారు...! కానీ మేము ధర్నా చేసిన బిల్డింగ్ కు సంబంధించి 0.37 ఎకరాలు ఆక్రమణ జరిగిందని, 23 మీటర్లు ఎన్ క్రోచ్ అయ్యిందని రంగనాథ్ గారే ఒప్పుకున్నారు..! ఉన్న నాలాలను డైవర్ట్ చేయకుండా కట్టారని...దాని తర్వాత కోకాపేట, నార్సింగ్ ఏరియాలు వరద బాధిత ప్రాంతాలుగా మారాయని చెప్పారు..!ఇంకొక సందర్భంలో ఆదిత్య, కేడీఆర్ రియల్టీ వాళ్లు కట్టే ఈ బిల్డింగ్ ఆపకపోతే బిల్డింగ్ ఉండే వారితో పాటు చుట్టు పక్కల వారి ప్రాణాలకు ప్రమాదం అని చెప్పాడు.

దీనికి సంబంధి అక్టోబర్ 22, 2025 లోనే హైడ్రా రంగనాథ్ గారి స్థానిక తహసీల్దార్ కు లేఖ రాశారు. వీటికి సంబంధించిన అన్ని ఫ్రూప్స్ కూడా మా వద్ద ఉన్నాయి. మళ్లీ సిగ్గు లేకుండా.. మేము మార్చి 3 నాడు ధర్నా చేస్తే....హైడ్రా నుంచి వీడియోలు తీసి పెడతరా..! మా ధర్నాకు ఆరు నెలల ముందే మీరే కదా లెటర్ రాసింది..? అందుకే చాలా సీరియస్ గా రంగనాథ్ గారి మీద డిఫమేషన్ కేసు వేస్తా అని హెచ్చరిస్తున్నా..!
నిజం మాట్లాడితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతరా? మీరు గ్రాఫిక్స్ డిజైనర్సా? కంటెంట్ క్రియేటర్సా?
నిజాలు చెబితే ఎదురు దాడి చేస్తారా? ప్రభుత్వం, ప్రతిపక్షాలు కూడా అలాగే ఉన్నాయి. నేను ఇచ్చిన ఆరు కంప్లైంట్స్ మీద చర్యలు తీసుకునే దమ్ములేదా? పైగా నిజం మాట్లాడితే నన్ను బద్నాం చేస్తావా? రంగనాథ్ గారు కచ్చితంగా మిమ్మల్ని కోర్టుకు లాగుతాను..! మీరు రాసిన లెటర్ ను నేను ఆన్ లైన్ లో పెడితే మీరు, మీ ప్రభుత్వం దూకి చచ్చిపోవాలి..!
ఆదిత్య రియల్టర్స్ వద్దకు వెళ్దాం. వాళ్లను కూల్చే దమ్ముందా? ప్రైవేట్ ప్రాపర్టీలో ఎందుకు ధర్నా చేశామని బాకాలు ఊదేవాళ్లు మాట్లాడుతున్నారు. ఆ హైవే ఎక్కి చూస్తే మరక మాదిరిగా ఉంది. ఐ సైట్ కు అడ్డం వచ్చే ఈ బిల్డింగ్ కు పర్మిషన్ ఎలా ఇచ్చారని ప్రజలు అంటున్నారు. ఎంత దారుణమైన వాయిలేషన్స్ ఉన్నాయో చెబితే ఆశ్చర్యపోతారు..!ఇక్కడున్న నాలాలను డైవర్షన్ చేస్తామని ఆదిత్యా నిర్మాణ సంస్థ పర్మిషన్ తీసుకుంది..! కానీ నాలాను డైవర్షన్ చేయకుండా ఏకంగా మూడు ఎకరాలు కబ్జా చేశారు. దీంతో మూసీ నది అక్కడ మురుగు కాల్వ మాదిరిగా మారిపోయింది..! ఆదిత్య సంస్థ అడ్డగోలు ఉల్లంఘనలు కట్టడాల వల్ల అక్కడ చాలా బిల్డింగ్ లు వరదలో మునిగిపోయాయి..! దీని మీద మాట్లాడితే మాలాంటి వాళ్లను ఈ ప్రభుత్వం బద్నాం చేస్తోంది..! అందరికీ ఒకే రూల్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్డింగ్ ను కూల్చాల్సిందేనని మేము డిమాండ్ చేస్తున్నాం..! కోర్టు ఆర్డర్ ఉందంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు..! మాకు చదువు రాదా? మాకు లాయర్లు లేరా? ఏం జరిగిందో తెలియదా?

ఈ రోజు సాయంత్రం వరకు హైడ్రా చేసిన ట్వీట్స్ డిలీట్ చేయకపోతే కోర్టులో కేసు వేస్తాను...!
తమషాకు మేము ధర్నా చేశామని అనుకుంటున్నారా? ఫ్రూప్ లేకుండా నేను ఏదీ మాట్లాడను..! నేను చేసిన ఆరోపణలన్నీ కూడా మీరు గతంలోనే చేసిన ఆరోపణలే..!
ఏప్రిల్ 2025 లోనే 61 మీటర్లు కబ్జా అయ్యిందని మీరే చెప్పారు.
కానీ పేదవాళ్లను ఆగం చేస్తూ...పెద్దవాళ్లను మాత్రం కాపాడుతున్నారు.
ఈ ప్రభుత్వం, మీరు మొత్తం బోగస్. మీ వద్ద ఫేక్ డిజిటల్ వాసన వస్తోంది.
మూసీ నది క్లీన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటనల మీద ప్రకటనలు చేస్తోంది.
కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ కు తాకట్టు పెడుతున్నారని ఇది వరకు అసెంబ్లీ సమావేశాల్లోనే జాగృతి చెప్పింది.
డీపీఆర్ సబ్మిట్ చేస్తున్నామని రెండు రోజుల క్రితం చెప్పిన ప్రభుత్వం అసలు మూసీ చుట్టు ఏం పని చేస్తారో చెప్పటం లేదు.
ఇప్పటి వరకు కూడా మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఏం చేస్తామన్నది స్పష్టత ఇవ్వటం లేదు.
ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ లో ఫేజ్-1 గురించి మాత్రమే చెప్పారు.
ఇప్పటికి కూడా అసలు ప్రాజెక్ట్ పూర్తి డీపీఆర్ లేదు.
ఈ ప్రాజెక్ట్ కారణంగా వచ్చే ప్రయోజనం ఏంటన్నది ప్రభుత్వం వివరంగా ప్రజలకు చెప్పటం లేదు.
ఈ మొత్తం వ్యవహారంలో మోసం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.
గతేడాది సెప్టెంబర్ లో ప్రి పీజిబుల్ లో ఫేజ్ వన్ లో 5, 641 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు.
కానీ మొన్నటి ప్రజెంటేషన్ లో మాత్రం 6 వేల 5 వందల నుంచి 7 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
అంటే ఆరు నెలల్లోనే దాదాపుగా 1400 కోట్లు ఎలా పెరిగింది?
గాంధీ విగ్రహానికి 70 కోట్లో, 200 కోట్లో అవుతుందని సీఎం గారు చాలా లైటర్ వే లో చెబుతున్నారు.
అసలు 2 వందల కోట్లతో ఎంత మంది పేద ప్రజలకు ఇళ్లు కట్టించవచ్చో తెలుసా?
ఆరు నెలల్లో 14 వందల కోట్లు ఎందుకు పెరిగిందో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.
అదే విధంగా ఈ ప్రాజెక్ట్ లో ఇళ్లు కోల్పోయే వారిని పిలవకుండా వారిని హౌస్ అరెస్ట్ చేశారు..! ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులను పిలిచి ఏదో క్లోజ్డ్ డోర్ మీటింగ్ లా నిర్వహించారు..! మూసీ పక్కన ఉన్న ల్యాండ్ ను కేక్ మాదిరిగా పంచుకునేలా మీటింగ్ పెట్టారు..! అసలు ఈ ప్రాజెక్ట్ కారణంగా మూడు వేల ఎకరాలు కోల్పోతున్న బాధితులను ఎందుకు పిలవలేదు..?వాళ్లతో చర్చించకుండా సీఎం మాత్రం వన్ సైడెడ్ గా మీటింగ్ లో మాట్లాడారు..! మన్ కీ బాత్ మోడీ మాట్లాడినట్లుగానే వన్ సైడ్ గా మనకు ఇక్కడ ఉన్న చిన్న మోడీ మాట్లాడుతున్నారు...! కానీ భూమి కోల్పోతున్న పేదలకు ఏం చేస్తామన్న దానిపై మాత్రం ఏమీ చెప్పటం లేదు..!
గతంలో చంద్రబాబు, వైఎస్ ఆర్ కూడా మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు వచ్చాక మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ ప్రక్షాళనకు ప్రయత్నించారు. 17 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా మూసీ రివర్ బెడ్ మీద 30 లక్షల స్వేర్ ఫీట్ల నిర్మాణం చేయాలని భావించారు. కానీ దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ సర్కార్ కు ఫేజ్-1 లోనే 18 లక్షల స్వేర్ ఫీట్ల నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారు? అంటే తెరవెనుక ఏం మాయాజాలం నడిచిందో ప్రజలకు చెప్పాలి? మూసీ అభివృద్ధి అంటూ చేసిన ప్రజెంటేషన్ లో ఇడ్లిల మాదిరి డిజైన్లు మాత్రమే ఉన్నాయి. గతంలో అమరావతి అంటూ చంద్రబాబు ఇడ్లి పాత్ర విధంగా డిజైన్ చేసినట్లే ఇవి ఉన్నాయి..! అసలు మూసీకి 16 నాలాల నుంచి మురుగు నీళ్లు వస్తున్నాయి. వాటిని ఏ విధంగా రాకుండా చేస్తారో చెప్పలేదు. వాటిని క్లీన్ చేయకుండా నాలుగు ఎస్టీపీలు కడితే ఏం లాభం? మల్లన్న సాగర్ నుంచి కాకుండా కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తామని అందుకోసం 7 వేల కోట్లు ఖర్చు చేసే పనిచేస్తున్నారు. ఈ మొత్తం ఖర్చులను అసలు ఫేజ్-1 ప్రాజెక్ట్ లో భాగంగా చూపించలేదు..! అంటే ప్రాజెక్ట్ కు సంబంధించి ఇవన్నీ కూడా అదనంగా ఉండే ఖర్చే..! జియాగూడలో మూసీ వద్ద పెద్ద ఎత్తున మేకల మండి ఉంటుంది. వ్యర్థాలు వేసే చోటు లేక మూసీలోకే వ్యర్థాలను వదులుతున్నారు. అక్కడ స్లాటర్ హౌస్ కట్టాలి..! అదే విధంగా మూసీ చుట్టూ వ్యర్థాలు క్లీన్ చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బందిని పెంచాలి. ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అసలు మూసీలోకి మురుగు నీరు రాకుండా, అదే విధంగా ఆక్రమణలు జరగకుండా ముందు చర్యలు చేపట్టాలి. ప్రాజెక్ట్ కోసం 1430 ప్రాపర్టీలు కూల్చేస్తామని చెబుతున్నారు. కానీ ఆ బాధితులతో ఎందుకు మాట్లాడటం లేదు? మూసీని పూర్తిగా పాయిజన్ చేసి కింద ఉన్న జిల్లాకు ఈ పాయిజన్ క్యారీ చేస్తున్నారు. సిటీకి సంబంధించిన అంశం కావటంతో నా సిటిని కాపాడుకునేందుకు నేను మాట్లాడుతున్నా. మూసీ ప్రక్షాళన మంచి విధానంలో జరగాలి. దాని ద్వారా ప్రజలకు మేలు జరగాలి. అదే విధంగా అవసరానికి మించి సేకరణ చేసి పేదల ఇళ్లు కూల్చవద్దు.
•••••••
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments