ప్రమాదమా...? లారీతో గుద్ది చంపేశారా..? విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.!
- Writer Desk

- 15 minutes ago
- 3 min read
రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన రవాణా అధికారి వెంకన్న మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది..!
ఇసుక మాఫియా.. బొగ్గు మాఫియా ఇతర అక్రమ రవాణా దందాలు చేసేవాళ్ళు తమ మాట వినని రవాణా అధికారులను తమ పలుకుబడి ఉపయోగించి బదిలీ చేయించడం..లేదంటే వారిని అంతమొందించడం చేస్తుంటారనేది కొత్త విషయం ఏమీ కాదు.. గతంలో రాష్ట్రంలో ఎన్నో.చోట్ల ఘటనలు చోటు చేసుకున్నాయి..!
తాజాగా జరిగిన జిల్లా రవాణా అధికారి వెంకన్న రోడ్డు ప్రమాదం ఘటనను కూడా మాఫియా చేసిన హత్యగా భావిస్తున్నారు..! ఇది నిజంగానే ప్రమాదమా.. లేక ముందస్తు ప్లాన్ తో చేసిన హత్య నా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది..! కానీ అప్పటివరకు వేచి చూస్తే ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి రావొచ్చు.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం శాఖా పరంగా కూడా ప్రత్యేక విచారణ చేపట్టాలని నిర్ణయించి రవాణా శాఖ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణకు ఆదేశించింది..!

°°°°°°°°
ఈరోజు ఉదయం భూపాలపల్లి జిల్లా చెల్పూర్ లో స్థానిక ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంల్ జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకన్న తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు..! ఓ బొగ్గు రవాణా చేస్తున్న లారీ వెంకన్న ను ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు..! కొద్దిసేపట్లోనే ఘటనా స్థలంలోనే మృతి చెందారు..!
అయితే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. అది సాధారణ ప్రమాదం కాదని.. వెంకన్న మృతి వెనుక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..!
మరోవైపు మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ కీలక నేత హరీష్ రావు ఘటనపై తీవ్రంగా స్పందించారు.. ఘటన వెనుక కుట్ర ఉందని ఆరోపించారు..!
అన్నివైపుల నుండి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది..! ఈ మేరకు విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది..! ఈ ఘటన ప్రభుత్వాన్ని కూడా ఆందోళనకు గురిచేసిందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.. అలాగే రవాణా అధికారుల క్షేత్రస్థాయి భద్రత ఇతర అంశాలపై కూడా విచారణ నివేదికలో ఉండేలా చూడాలని పేర్కొన్నారు..! వాహనాల తనిఖీలు తదితర అంశాలలో రవాణా అధికారులు సిబ్బంది కి సంబంధించిన నియమావళి పై కూడా తగిన సూచనలు నివేదికలో పొందుపరచాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు..!

హైదరాబాద్, రవాణా కమిషనర్ కార్యాలయం, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఆర్ఎస్సి) అయిన శ్రీ ఎం. చంద్ర శేఖర్ గౌడ్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది..!
°°°°°°°°°°
విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు యధాతతంగా తెలుగులో తర్జుమా చేసి అందిస్తున్నాం...!
రవాణా శాఖ - రహదారి భద్రత - భూపాలపల్లి జిల్లా, చెల్పూర్లోని ఆర్టిఓ కార్యాలయం సమీపంలో జరిగిన ఘోర రహదారి ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి శ్రీ ఎం. వెంకన్న మృతి చెందారు - విచారణ ఏర్పాటు - ఉత్తర్వులు - జారీ చేయబడినవి.
రవాణా, రహదారులు & భవనాలు (Tr.I) విభాగం
జి.ఓ.ఆర్.టి.నెం.346
తేదీ: 22.06.2026
ఆర్డర్ -
22.06.2026వ తేదీన, సుమారు ఉదయం 09:30 గంటలకు, భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిందని నివేదించబడింది. జిల్లా రవాణా అధికారి శ్రీ ఎం. వెంకన్న తన అధికారిక విధులను నిర్వర్తిస్తుండగా, బొగ్గుతో వెళ్తున్న లారీ ఆయనను ఢీకొట్టడంతో ఆయన మరణించారు. జిల్లా రవాణా అధికారి శ్రీ ఎం. వెంకన్న మరణం ప్రభుత్వానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, ఈ ఘటనకు దారితీసిన వాస్తవాలు మరియు పరిస్థితులను నిర్ధారించడానికి, అలాగే ప్రజా రహదారులపై అమలు విధులను నిర్వర్తించేటప్పుడు క్షేత్రస్థాయి అధికారులు మరియు సిబ్బంది భద్రత కోసం చర్యలను సిఫార్సు చేయడానికి, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించడం అవసరమని భావిస్తోంది.
2. ప్రభుత్వం, ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, పై సంఘటనపై విచారణకు ఆదేశించునది మరియు 22.06.2026న భూపాలపల్లి జిల్లా, చెల్పూర్లోని ఆర్టిఓ కార్యాలయం సమీపంలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు మరియు పరిస్థితులపై విచారణ జరపడానికి, హైదరాబాద్, రవాణా కమిషనర్ కార్యాలయం, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఆర్ఎస్సి) అయిన శ్రీ ఎం. చంద్ర శేఖర్ గౌడ్ను విచారణ అధికారిగా నియమించడమైనది. ఈ ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి అయిన శ్రీ ఎం. వెంకన్న గారి మరణం సంభవించింది.
3. విచారణ అధికారి ఈ సంఘటనపై సవివరమైన నివేదికను వీలైనంత త్వరగా హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర రవాణా కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించాలి.
4. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి, విచారణ అధికారి ప్రజా రహదారులపై వాహనాలను అడ్డగించడం మరియు స్వాధీనం చేసుకునే కార్యకలాపాల కోసం క్షేత్రస్థాయి అమలు నియమావళి, భద్రతా పరికరాలు మరియు ప్రామాణిక నిర్వహణ విధానాలలో మార్పులతో సహా సూచించిన తగిన చర్యలను నివేదించాలి.
5. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, హైదరాబాద్ ఈ విషయంలో తదనుగుణంగా తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
(తెలంగాణ గవర్నర్ ఆదేశానుసారం మరియు వారి పేరు మీద)
వికాస్ రాజ్
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రవాణా శాఖ కమిషనర్. తెలంగాణ రాష్ట్ర, హైదరాబాద్.
శ్రీ ఎం. చంద్ర శేఖర్ గౌడ్, సంయుక్త రవాణా కమిషనర్ (ఆర్ఎస్సి). రవాణా కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్.
భూపాలపల్లి జిల్లా కలెక్టర్.
దీనికి కాపీ చేయండి:
గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి గారి వ్యక్తిగత కార్యదర్శి.
గౌరవనీయ మంత్రి (రవాణా & BCW) గారి OSD.
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టి.ఆర్&బి శాఖకు పి.ఎస్.
Sf/Sc.
//ఆదేశానుసారం పంపబడినది//
సెక్షన్ ఆఫీసర్
°°°°°°°°°°
A Report By
ShyamaSundar Akula




Comments